
సిద్దిపేట, 23 జూన్ (హి.స.)
రసాయన ఎరువుల వినియోగాన్ని
తగ్గించి భూమిని కాపాడుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ గోపాలరావు రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం వారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చౌడారం గ్రామంలో ఎఫ్పీఓ, ఇఫ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఖేత్ బచావో' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం అధికమవడంతో భూముల సారవంతత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు రసాయన ఎరువులను పరిమితంగా వినియోగిస్తూ, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సారవంతమైన భూమిని అందించాలంటే ఇప్పటి నుంచే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, తగిన మోతాదులోనే రసాయన ఎరువులను ఉపయోగించాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, సర్పంచులు వాసుదేవచారి, వంకాయల రేఖ రాజు, శాస్త్రవేత్తలు డాక్టర్ తమ్మిరాజు, డాక్టర్ వెంకట్ కుమార్, డాక్టర్ మురళీకృష్ణ, చంద్రబాబు నాయుడు, వ్యవసాయ అధికారి జయంతి కుమార్, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ నాగిరెడ్డి, కృష్ణ, మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..