
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం గాంధీభవన్ వేదికగా నిర్వహించిన సీఎల్పీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ లాంటి హామీలను నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతులు, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా చేయాల్సినవి ఉన్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అందులో ఏవి ఇవ్వలేదో చెప్పాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లను ఎందుకు కట్టించలేకపోయిందని ప్రశ్నించారు. సన్న బియ్య మ్యానిఫెస్టోలే లేకపోయినా ఇస్తున్నామని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు