
అమరావతి, 10 జూలై (హి.స.)
ఆహ్లాదకర వాతావరణం.. విభిన్న పంటల సాగుకు నిలయమైన కుప్పం ప్రాంత రైతులు అవకాడో సాగును ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. వేడి తక్కువగా ఉండే చల్లటి వాతావరణంలో పండే అరుదైన అవకాడోను శాంతిపురం మండలంలోని రైతులు పండిస్తున్నారు. మండల పరిధి బెండనకుప్పం, 121-పెద్దూరు, శెట్టేపల్లె వద్ద సుమారు పదెకరాల్లో తోటలను సాగు చేస్తున్నారు. శెట్టేపల్లెకు చెందిన ఉద్యాన రైతు లక్ష్మీనారాయణరెడ్డి మూడెకరాల్లో 400 మొక్కలు వేశారు. మైసూరు సమీపంలోని ఓ నర్సరీలో(ల్యాంబో యాష్, మ్యాక్సిన్ యాష్ రకం) మొక్కలను రూ.650 వంతున కొనుగోలు చేసి.. మూడేళ్ల కిందట నాటారు. ప్రస్తుతం దిగుబడి చేతికందే దశకు చేరుకొంది. మొదటి విడతలో చెట్టుకు 10 కిలోల వరకు దిగుబడి లభిస్తుందని తెలిపారు. పెట్టుబడి రూ.4 లక్షల వరకు వెచ్చించారు. బిందుసేద్యంతో నీటి తడులు అందిస్తూ.. వేప పిండి, కానుగ పిండి, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. 25 ఏళ్ల వరకు దిగుబడి లభిస్తుందని.. ఏడాదికి రెండు విడతలుగా కాయల్ని కోయవచ్చని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో అవకాడో ధర రూ.120 వరకు పలుకుతున్నందున.. గిట్టుబాటు ఆదాయం ఖాయమని లక్ష్మీనారాయణరెడ్డి అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ