
న్యూఢిల్లీ, 13 జూలై (హి.స.)
భారత విభజన నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ పార్టీ మరియు నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్-నెహ్రూ-గాంధీ కుటుంబం అంటే దేశానికి 'సమస్యలను సృష్టించే ఒక యంత్రం' అని ఆయన అభివర్ణించారు. సామాజిక మాధ్యమం 'X' (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ను షేర్ చేస్తూ.. జూలై 13, 1947 నాటి పరిణామాలను కాంగ్రెస్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు.
లేడీ ఎడ్వినా మౌంట్బాటన్ ఒత్తిడికి లొంగి, మహాత్మా గాంధీ అభిప్రాయాలను పక్కనబెట్టి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతదేశ విభజనకు అంగీకరించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. బెంగాల్, పంజాబ్ విభజన కోసం ఏర్పాటు చేసిన సరిహద్దు కమిటీల వల్ల భారత్ వ్యూహాత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. నెహ్రూ, జిన్నా మరియు సుహ్రవర్ది మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కోల్కతా నగరం ఆరు నెలల పాటు పాకిస్తాన్కు రెండో రాజధానిగా మారేదని, అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ జోక్యం చేసుకోవడం వల్లే కోల్కతా భారత్లోనే ఉండిపోయిందని ఆయన గుర్తుచేశారు.
బెంగాల్ విభజన కమిటీ వల్ల హిందువులు మెజారిటీగా ఉన్న చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్, సిల్హెట్ జిల్లాలను భారత్ వదులుకోవాల్సి వచ్చిందని దూబే పేర్కొన్నారు. అలాగే పంజాబ్ విభజన సమయంలో హిందూ-సిక్కులు ఎక్కువగా ఉన్న లాహోర్తో పాటు పవిత్ర స్థలాలైన కర్తార్పూర్ సాహిబ్, నాన్కానా సాహిబ్ గురుద్వారాలను పాకిస్తాన్కు ఇచ్చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉండటానికి ఆనాటి నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.
మాల్దా, ముర్షిదాబాద్, డార్జిలింగ్, గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్ వంటి సరిహద్దు జిల్లాల విభజనను సరిగ్గా చేయకపోవడం వల్లే.. నేటికీ భారతదేశం చొరబాట్లు, ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా మరియు ఆవుల స్మగ్లింగ్ వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి కోలుకోలేకపోతోందని నిషికాంత్ దూబే విమర్శించారు. 1947 జూలై మధ్యలో బ్రిటిష్ పార్లమెంట్లో భారత స్వాతంత్ర్య బిల్లు తుది దశకు చేరిన చారిత్రక నేపథ్యాన్ని మరియు రాడ్క్లిఫ్ కమిటీ సరిహద్దుల విభజన ప్రక్రియను గుర్తుచేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi