
రాజస్థాన్, 13 జూలై (హి.స.)
వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం
మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్లోని బాలోత్రా జిల్లా పచ్పద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం నేషనల్ హైవే (NH-125) పై ముందు వెళ్తున్న ఒక డంపర్ ట్రక్కును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో స్కార్పియో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా కానోడ్ గ్రామానికి చెందిన నివాసితులుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద తీవ్రతకు నలిగిపోయిన వాహనం...
పచ్పద్ర పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దుంగారామ్ ఖోత్ తెలిపిన వివరాల ప్రకారం.. కానోడ్ గ్రామానికి చెందిన యువకుల బృందం సెలవు దినం కావడంతో విహారయాత్ర (Outing) కోసం పర్సాలా ప్రాంతానికి వెళ్లి స్కార్పియోలో తిరిగి వస్తుండగా భాండియావాస్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన వేగానికి స్కార్పియో వాహనం ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని ప్రథమ చికిత్స అనంతరం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం మరో ముగ్గురు జోధ్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..