మణిపూర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్; ఆయుధాలు, నిధుల వసూలు పత్రాల స్వాధీనం
మణిపూర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్; ఆయుధాలు, నిధుల వసూలు పత్రాల స్వాధీనం
మణిపూర్


ఇంఫాల్ (మణిపూర్), 13 జూలై (హి.స.)

మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీ పరిధిలోని రెండు జిల్లాల్లో వేర్వేరు నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. స్థానిక ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

తౌబాల్ జిల్లా పరిధిలోని తౌబాల్ బజార్‌లో తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలు.. నిషేధిత ఉగ్రవాద సంస్థ KCP (MFL) కి చెందిన ఇద్దరు చురుకైన క్యాడర్లను అరెస్ట్ చేశారు. వారిని అబుజం సుమిత్ సింగ్ (20), మకుచుంగ్ గాంగ్మెయి (23)గా గుర్తించారు. బలవంతపు వసూళ్ల కోసం వాడుతున్న 48 'డొనేషన్ కార్డ్స్' (వసూళ్ల రశీదులు) వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఇంఫాల్ వెస్ట్ పరిధిలోని ఖుమాన్‌లాంపార్క్ సమీపంలో మరో నిషేధిత సంస్థ 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' (PLA / RPF) కి చెందిన చురుకైన ఉగ్రవాది ఓయినమ్ ధనంజయ్ సింగ్ అలియాస్ అబుంగ్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక స్కూటర్‌ను సీజ్ చేశారు.

ఈ అరెస్టులతో పాటు మణిపూర్‌లోని లోయ ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలైన తౌబాల్ జిల్లాలోని ఇకోప్ పాట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని నతుమ్ చింగ్ మరియు సనసాబీ ప్రాంతాలలో భద్రతా దళాలు భారీ శోధన కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఒక స్వదేశీ తయారీ AK రైఫిల్, హ్యాండ్ గ్రెనేడ్లు, బాంబులు మరియు పెద్ద ఎత్తున లైవ్ బుల్లెట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్‌లో జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేసేందుకు భద్రతా దళాలు నిరంతరం ఇటువంటి సోదాలు నిర్వహిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande