
శ్రీనగర్, 13 జూలై (హి.స.) జమ్మూకశ్మీర్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా బారాముల్లా జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ‘ది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ’ (ఎన్సీఎస్) అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్కు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వారు వెల్లడించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయని తెలిపారు.
అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి స్వల్పంగా కంపించడంతో బారాముల్లా, దాని చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 3.6 కావటంతో ఇళ్లు కూలిపోవడం గానీ, ప్రజలకు గాయాలు అవ్వటం గానీ జరగలేదు. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV