చెత్తకుప్పల్లో కాదు.. 'ఊయల'లో ఉంచండి.. కలెక్టర్ ప్రియాంక
చెత్తకుప్పల్లో కాదు.. 'ఊయల'లో ఉంచండి.. కలెక్టర్ ప్రియాంక
Collector


నారాయణపేట, 15 జూలై (హి.స.)

అనివార్య పరిస్థితుల్లో నవజాత శిశువులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెత్తకుప్పలు వంటి ప్రాంతాల్లో వదిలివేయకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'ఊయల' లో సురక్షితంగా ఉంచాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నారాయణపేట ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వదిలివేయబడిన శిశువుల ప్రాణాలను కాపాడి వారికి భద్రమైన సంరక్షణ కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఒకవైపు కొంతమంది నవజాత శిశువులను అనాథలుగా వదిలివేస్తుండగా, మరోవైపు సంతానం లేని దంపతుల (CARA) నిబంధనల ప్రకారం చట్టబద్ధ దత్తత కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందన్నారు.

ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని శిశువును పెంచుకునే అవకాశం లేని తల్లిదండ్రులు ఎలాంటి భయం, సంకోచం లేకుండా 'ఊయల'లో వదిలి వెళ్లాలని సూచించారు. ఊయలలో ఉంచిన శిశువులను మహిళా, శిశు సంక్షేమ శాఖ పూర్తి బాధ్యతతో సంరక్షించి, అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుని అర్హులైన దత్తత తల్లిదండ్రులకు చట్టబద్ధంగా దత్తత ఇచ్చే ప్రక్రియను నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నవజాత శిశువుల ప్రాణాలను కాపాడడంతో పాటు వారికి మంచి భవిష్యత్తు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande