
జోగులాంబ గద్వాల, 17 జూలై (హి.స.)
సైబర్ నేరాల బాధితులకు సత్వర
న్యాయం అందించడంలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు మరో మైలురాయిని అధిగమించారు. మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM) విధానం ద్వారా, జిల్లాలో తొలిసారిగా గట్టు మండలానికి చెందిన సైబర్ బాధితుడి ఖాతాలోకి రూ.40 వేల నగదును పోలీసులు తిరిగి జమ చేయించారు. సైబర్ మోసంలో రూ. 1 లక్ష కోల్పోయిన బాధితుడికి, ఎఫ్ఎఆర్ అవసరం లేకుండానే ఈ కొత్త సాంకేతికత ద్వారా నగదును వెనక్కి ఇప్పించడం గమనార్హం. ఈ విజయవంతమైన ప్రక్రియలో కృషి చేసిన సైబర్ టీమ్ (D4C) సిబ్బందిని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అభినందించారు. పోలీసులు అందించిన సేవలకు గాను బాధితుడు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని సైబర్ వారియర్స్కు అందించిన ప్రత్యేక శిక్షణ వల్లే ఇది సాధ్యమైందని, ముఖ్యంగా రూ.50 వేల లోపు ఫ్రీజ్ అయిన మొత్తాన్ని కోర్టు ఉత్తర్వులు లేకుండానే తిరిగి అందించే అవకాశం ఈ ఎం.ఆర్.ఎం. విధానంలో ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు తక్షణమే 1930 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..