
కిర్లంపూడి, 15 జూలై (హి.స.)
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మృతితో వైసీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. వైసీపీ అధినేత జగన్ ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కిర్లపూడికి వెళుతున్నారు. ఇప్పటికే ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ముద్రగడ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయల్దేరనున్నారు. తొలుత భీమవరం చేరుకుని ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఫీడ్ ధరల విపరీత పెంపు, మార్కెట్లో గిట్టుబాటు ధరల లేమి తదితర సమస్యలపై రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు.
భీమవరం పర్యటన ముగిసిన అనంతరం మధ్యాహ్నం హెలికాప్టర్లో జగ్గంపేట చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళతారు. అక్కడ ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi