
కరీంనగర్, 16 జూలై (హి.స.)రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో పాల్గొని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ‘సర్’ను తేలిగ్గా తీసుకుంటే.. ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా చైతన్యపురిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్లి, ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘చేతిలో ఓటరు కార్డు ఉంటే సరిపోదు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసే హక్కు ఉంటుంది. బీఎల్వో ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించి దరఖాస్తులు అందజేయాలి. యువత బాధ్యతగా తమ కుటుంబసభ్యుల ఓట్లు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. ‘సర్’.. రాజకీయ కార్యక్రమం కాదు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రక్రియ. కేవలం పది నిమిషాలు కేటాయించి ఎన్యూమరేషన్ ఫారం నింపకపోతే.. భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్