
న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.)
: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును (Delimitation Bill) గనుక మళ్లీ ప్రవేశపెడితే, దానిని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, వారి ఐక్యతను కాపాడటానికి కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు.న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను పునర్విభజిస్తే, జనాభాను పెంచుకుంటూ పోయిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 'ఇండియా' (INDIA) కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా ఏకం చేసి పార్లమెంట్లో ఉమ్మడి పోరాటం చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల రాజకీయ హక్కులను కాలరాసేలా కేంద్రం తీసుకునే ఎలాంటి ఏకపక్ష నిర్ణయాన్నైనా తాము అంగీకరించబోమని జైరాం రమేష్ హెచ్చరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi