
హైదరాబాద్, 16 జూలై (హి.స.)ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీంను జులై 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమని భారాస శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘గడువు తేదీలు మారుతున్నాయే తప్ప.. ఉద్యోగుల హెల్త్ కార్డులు మాత్రం జారీచేయడం లేదు. ఉద్యోగుల నుంచి రెన్నెళ్ల ప్రీమియం వసూలు చేసి.. పథకం అమలు చేయకుండా ఉండటం మోసం చేయడమే. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? పథకం అమలుకు ఇప్పటివరకూ మార్గదర్శకాలే విడుదల చేయలేదు. ఇప్పటికైనా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. లేదంటే వారి పక్షాన భారాస పోరాటానికి సిద్ధమవుతుంది. పథకం అమలు చేయకుండా కోత విధించిన డబ్బులను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్