
నెల్లూరు, 16 జూలై (హి.స.)నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ రోజు ఉదయం జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు హాజరయ్యారు.
సమావేశంలో జిల్లాలో గత నెల రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన అంశాన్ని సమీక్షించారు. ధరల పెరుగుదలకు గల కారణాలపై వ్యాపారులతో జాయింట్ కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు నిత్యం వినియోగించే కందిపప్పు, మినప్పప్పు, వంట నూనెలు, బియ్యం ధరలు ఈ నెలలో అధికంగా పెరిగాయని తెలిపారు. ధరలను తగ్గించేందుకు రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, వ్యాపారులు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా బియ్యం ధరలు అధికంగా పెరిగిన నేపథ్యంలో, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించి ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.
దీనికి స్పందించిన మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పుధాన్యాల ధరలను కిలోకు రూ.5 నుంచి రూ.9 వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలను అనవసరంగా పెంచకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినంత సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రైతు బజార్లలో కూడా నిత్యావసర వస్తువుల విక్రయానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV