
హైదరాబాద్, 16 జూలై
(హి.స.)
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం,
సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం
(జూలై 16న) ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది
ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ మహోత్సవాలకు ఆద్యంగా, గోల్కొండ
కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ తొలి
బోనంతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే బోనాల సంబరాలకు అధికారికంగా
శ్రీకారం చుట్టారు. గోల్కొండలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో
తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై
బోనాలు మోసుకుంటూ, పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, జానపద కళారూపాల నడుమ ఆలయ పరిసరాలు భక్తి
పారవశ్యంతో కళకళలాడుతున్నాయి. “జై మహంకాళి” నినాదాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక
వాతావరణంలో మునిగిపోయింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీటి సదుపాయం, వైద్య
శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులను
అందుబాటులో ఉంచారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన
ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు ప్రత్యేక
పోలీసు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో
పనిచేస్తూ భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని చర్యలు
తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi