
హైదరాబాద్, 17 జూలై (హి.స.)హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఏసీబీ గుబులు పట్టుకుంది. చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడడంతో హెచ్ఎండీఏ అధికారవర్గాల్లో కలవరం మొదలైంది. హెచ్ఎండీఏలోని అధికారులు, ఉద్యోగుల్లో ఏసీబీ దాడుల అంశమే చర్చనీయాంశంగా మారింది. ఏ ఒక్కరిని కదిపినా పట్టుబడిన నగదుపైనే చర్చ.
లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు పట్టుకోవడమే కాదు ఆదాయానికి మించి ఆస్తులను ప్రభుత్వ ఉద్యోగులు సంపాదిస్తే కూడా ఏసీబీ దాడులు చేస్తుందనే భయం అధికారులు, ఉద్యోగుల్లో నెలకొన్నది. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉదోగ్యం చేసినవారు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యాన్ని కుటుంబం ఎంతో గౌరవంగా భావిస్తుంది. హెచ్ఎండీఏలో 30ఏళ్లకు పైగా విధులు నిర్వర్తించిన రవీందర్ ఉద్యోగ విరమణ గడువు వచ్చే ఏడాది జూన్ వరకే ఉన్నది.
రిటైర్మెంట్కు ముందు ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేయడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. అతడిని రిమాండ్కు తరలించిన నేపథ్యంలో రేపో, మాపో రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయనుంది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్గా మరొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్