
విశాఖపట్నం, 27 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సహజసిద్ధమైన తీపి నీటి సరస్సు, పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం జిల్లాలోని ‘కొండకర్ల ఆవ’ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వైవిధ్యభరితమైన పక్షుల సంరక్షణ కేంద్రంగా, జీవవైవిధ్యానికి నిలయంగా ఉన్న ఈ చిత్తడి నేలల (వెట్ల్యాండ్స్) వ్యవస్థను కాపాడేందుకు దీనిని అధికారికంగా ‘కన్జర్వేషన్ రిజర్వ్’ (Conservation Reserve) గా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవతోనే ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించింది. ఈ నిర్ణయం వల్ల కొండకర్ల ఆవ పరిధిలో పర్యావరణాన్ని దెబ్బతీసే అక్రమ కట్టడాలు, రసాయనాల కాలుష్యం మరియు వేటపై పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల పరిధిలో ఇక్కడి జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, వలస పక్షుల రక్షణకు ప్రత్యేక నిధులను కేటాయించి ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటక అనుకూల కేంద్రంగా అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు, పక్షుల నిపుణులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi