
హైదరాబాద్, 29 జూలై (హి.స.)
భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్
ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సైబరాబాద్ ఏరియా పరిధిలోని అన్ని కంపెనీలు, సంస్థలు మధ్యాహ్నం 3.30 గంటల నుండి ఉద్యోగులను దశలవారీగా ముందుగానే ఇళ్లకు పంపించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ను అంచనా వేసి, రద్దీ లేకుండా చూసేందుకు ఏ కంపెనీ లేదా సంస్థ నుండి ఉద్యోగులు ఏ సమయంలో లాగ్ అవుట్ అవుతారనే వివరాలను trfcord@scsc.in అనే ఈమెల్కు పంపాలని కోరారు. ఇదిలా ఉంటే వర్షం పడిందంటే నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం సమయంలో ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి ఉద్యోగులు బయటకు రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగులను దశలవారిగా బయటకు పంపాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..