
హైదరాబాద్, 29 జూలై (హి.స.)భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంబర్పేట్ డివిజన్ ఉమర్ నగర్లో సుల్తాన్ (44) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అస్మా ఫరిన్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడి అత్త సబియా బేగం మామ షరీఫ్ నిజామాబాద్లో ఉంటారు.
సుల్తాన్ పండ్ల వ్యాపారంలో వచ్చిన డబ్బులను తన కుమార్తె పేరు మీద పోస్ట్ ఆఫీస్లో వేయాలని, ప్రతినెల 5 నుంచి 6 వేల రూపాయలు తన భార్యకు ఇస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు తన భార్య కుమార్తె పేరు మీద డబ్బులు వేస్తున్నానని చెప్పడంతో ఆమెను నమ్మానని తెలిపాడు. పోస్టాఫీస్కి వెళ్లి చూడగా తన కుమార్తె అకౌంట్లో కేవలం రూ. 6 వేలు మాత్రమే ఉన్నాయని సుల్తాన్ పేర్కొన్నాడు. అదే విధంగా నిజామాబాద్లో స్థలం కొనమని తన అత్తమామలకు రూ. 3 లక్షలు ఇవ్వగా వారు స్థలం కొనకుండా మోసం చేశారని అన్నాడు.
పండ్ల వ్యాపారంలో తాను 20 నుంచి 25 లక్షల రూపాయలు సంపాదించి తన భార్యకు ఇవ్వగా ఆమె డబ్బులు లేవని చెబుతున్నదని వాపోయాడు. పైగా ఆమె అక్రమ సంబంధాలను కలిగి ఉందని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. డబ్బులు అడిగితే తన భార్య అత్తమామలు తనను మానసికంగా వేధిస్తున్నారని, వారి వేదన భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. తన డబ్బులను తన పిల్లల పేరు మీద ఉంచాలని ఆయన వీడియోలో వెల్లడించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్