సర్కారు బడుల్లో ఏఐ కోడింగ్ ల్యాబ్లు
రూ.40 కోట్ల పీఎంశ్రీ నిధులతో అభివృద్ధి ఈ ఏడాది నుంచి 10వ తరగతికీ ఏఐ పాఠ్యపుస్తకం.
AI coding


హైదరాబాద్, 30 జూలై (హి.స.)రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) కోడింగ్ ల్యాబ్లు ఏర్పాటు కానున్నాయి. ఏఐపై అవగాహన లేకుండా భవిష్యత్తులో మనుగడ సాగించలేని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. అందుకు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. ల్యాబ్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినందున ఈ విద్యా సంవత్సరమే(2026-27) అవి అందుబాటులోకి రానున్నాయి.

అన్ని సాంకేతికతలకు నిలయం..

రాష్ట్రవ్యాప్తంగా 794 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ స్కూళ్లుగా గుర్తించారు. వాటిల్లో అన్ని సౌకర్యాలను కల్పించి.. మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ క్రమంలో జిల్లా కేంద్రాలు లేదా సమీపంలో ఉన్న 33 రాష్ట్ర ప్రభుత్వ పీఎంశ్రీ స్కూళ్లను ఏఐ హబ్ స్కూళ్లుగా మారుస్తారు. అంటే జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేస్తారు. అందులో భాగంగా ఏఐ కోడింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. పీఎంశ్రీ పథకం కింద మొత్తం రూ.40 కోట్లు ఖర్చు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏఐ కోడింగ్ ల్యాబ్లో భాగంగా కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్స్కు సంబంధించిన పరికరాలు, ఏఐ టూల్స్ తదితర అన్ని రకాల సాంకేతికతలను నేర్చుకునేలా ఆధునిక ల్యాబ్ను ఏర్పాటు చేస్తారు.

గత విద్యా సంవత్సరం (2025-26) నుంచి 1-5 తరగతుల్లో గణితం పాఠ్య పుస్తకంలో ఏఐ పాఠాలను చేర్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి పదో తరగతికి సైతం ఏఐ పాఠ్య పుస్తకాన్ని పుణెకు చెందిన పై జామ్ ఫౌండేషన్ సహకారంతో ఎస్సీఈఆర్టీ బృందం రూపొందించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande