
అమరావతి, 31 జూలై (హి.స.)
,:గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, రేపు ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
గోదావరి పరీవాహక జిల్లాల్లో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పరిస్థితుల నేపథ్యంలో నదిలో స్నానం చేయడం, చేపలు పట్టడం వంటి పనులకు వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ