
కర్నూలు, 31 జూలై (హి.స.) తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే గడిచిన రెండు మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈ రోజు కూడా వానలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో తుఫాను గాలులతో వర్షాలు
వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా గట్టిగానే పడనుంది. శుక్రవారం ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాలతో పాటు పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV