
Andhra Pradesh, 07 జూలై (హి.స.)హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో ఒకటైన శివాలయం వద్ద కొందరు యువకులు చేసిన అపచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలోని వీరుపాపురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న అనే యువకుడు ఒక శివాలయం వద్దకు వెళ్లి, అక్కడ భక్తిశ్రద్ధలతో వెలిగించిన పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి అత్యంత అసభ్యకరంగా, అమర్యాదగా ప్రవర్తించాడు.
వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు..
మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. సదరు యువకుడు చేస్తున్న ఈ అపచారాన్ని, మూర్ఖత్వాన్ని అడ్డుకోవాల్సిన అతని సహచరులు (స్నేహితులు) దానిని సరదాగా భావించి వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ ఉదంతం చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన హిందూ భక్తులు, నెటిజన్లు సదరు వ్యక్తితో పాటు అతనికి సహకరించిన స్నేహితులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (@Anitha_Vangalapudi) అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను ట్యాగ్ చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కాగా, తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ వైరల్ వీడియోపై, మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసిన ఈ ఘటనపై ఏపీ పోలీసులు ఏ విధంగా స్పందించి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV