
భద్రాద్రి కొత్తగూడెం, 08 జూలై (హి.స.)
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూసేకరణ పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ములకలపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూసేకరణ సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ములకలపల్లి గ్రామ పరిధిలో 160 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 22 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. మిగిలిన సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే సందర్భంగా భూములతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను కచ్చితంగా నమోదు చేసి పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..