
అమరావతి, 08 జూలై (హి.స.)
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుసచివాలయంలో ఈరోజు (బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఛార్జీలపై 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత భవనాలకు రూ.500 కోట్ల మంజూరుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మెస్ ఛార్జీల పెంపునపై మంత్రి సవిత హర్షం..
మెస్ ఛార్జీల పెంపునపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు సొంతిళ్లు మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ