
కర్నూలు , 08 జూలై (హి.స.) కర్నూలులో గత వారం 5 రోజులుగా వైరల్ ఫీవర్ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగుల రద్దీ సాధారణం కంటే 20 శాతం వరకు పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు.వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రోగులు క్యూ కట్టారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులతో ఆస్పత్రి కిటకిట లాడింది.
వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దఎత్తున తరలివ చ్చారు. ఓపీ కేంద్రాల్లో వైద్యులు చికిత్స అందించారు. ఎక్కువగా రోగులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మందుల కోసం రోగులు బారులు తీరారు. ఔషధశాల ఓపీ నెంబర్.13 వద్ద ఐదు క్యూలైన్లు రోడ్డు వరకు చేరారు. క్యూలైన్లలో నిలబడలేక గంటల తరబడి రోగు లు అవస్థలు పడ్డారు.
ఆందోళన అవసరం లేదు
వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా నగరంలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణమే. గడిచిన వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో రోగులు వస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చికిత్స తీసుకోవడంతో పాటు 2-3 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే వెంటనే కోలుకునే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV