
అనంతపురం, 08 జూలై (హి.స.) అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం జూలై 14 లోగా ఎఫ్-ఫారం సమర్పించాలని, లేనిపక్షంలో ఓటు తొలగిస్తారని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని, గడువులోగా నిర్దేశిత ఫారాలను సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్లు తమ ఎఫ్-ఫారాన్ని (F-Form) జూలై 14వ తేదీ లోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLO) తప్పకుండా అందజేయాలి.ఒకవేళ 2002 నాటి పాత వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ప్రస్తుత చిరునామాతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పూర్తిగా పూరించిన ఎఫ్-ఫారాన్ని మీ పరిధిలోని సంబంధిత బీఎల్ఓ (BLO)కు మాత్రమే అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో ఇప్పటికే 45 శాతం ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు.స్థానికంగా లేని నాన్-లోకల్ ఓటర్లు తమ పేర్ల నమోదు కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్లు అందుబాటులో ఉన్న రెండు ఫారాల్లో ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఎఫ్-ఫారం ఇవ్వకపోతే, అటువంటి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది అని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV