
అమరావతికాకినాడ
,:రెండేళ్లుగా యూట్యూబ్ వేదికగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న యూట్యూబర్ జోసఫ్ రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఐసీఐసీఐ, యస్ బ్యాంకులకు కాకినాడ పోలీసులు అధికారికంగా లేఖలు రాశారు. పోలీసుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన బ్యాంక్ యాజమాన్యాలు, అతని పేరున ఉన్న ఖాతాలను తక్షణమే నిలిపివేస్తూ (ఫ్రీజ్) నిర్ణయం తీసుకున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో జోసఫ్ రావణ్ ఆర్థిక వనరులకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'ప్రశ్న' అనే వెబ్సైట్లో ఈ వివాదాస్పద వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా అతను నెలకు రూ. 1.50 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల్లో ద్వేషాన్ని రేకెత్తించే కంటెంట్ ద్వారానే ఈ సంపాదన వస్తున్నట్లు తేలింది.
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఈ నెల 2వ తేదీన రావణ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను తదుపరి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపించారు. ప్రస్తుతం అతని ఫోన్లో నిక్షిప్తమై ఉన్న వివాదాస్పద వీడియోలు, డిలీట్ చేసిన డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్లపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ