
నాగర్ కర్నూల్, 01 ఆగస్టు (హి.స.)
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వర్షాకాలంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు. శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ (RWS) అధికారులు, మిషన్ భగీరథ సిబ్బందితో నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడైనా పైపులైన్లు దెబ్బతిన్నా లేదా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా సేవలు అందించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వాటర్ లైన్మెన్లు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వర్షాకాలంలో నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా పని చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు