
రంగారెడ్డి, 01 ఆగస్టు (హి.స.)
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రపోజల్ల జాబితాపై చర్చ జరుగుతున్న సమయంలో 18వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ, కౌన్సిలర్ గూడూరి గిరి తమ వార్డులకు సంబంధించిన ప్రపోజల్ను లిస్టు నుంచి తొలగించరంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సమావేశ మందిరంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.
తమ వార్డుల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిన ప్రతిపాదనలను అధికారులు, పాలకవర్గం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వై.సుదర్శన్ కౌన్సిలర్ల అభ్యంతరాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. అయితే ఈ ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..