నీటి కోసం 'డబుల్ బెడ్రూమ్' వాసుల మహాధర్నా.. నేషనల్ హైవేపై నిలిచిన వాహనాలు
నీటి కోసం 'డబుల్ బెడ్రూమ్' వాసుల మహాధర్నా.. నేషనల్ హైవేపై నిలిచిన వాహనాలు
Nalgonda


నల్గొండ, 01 ఆగస్టు (హి.స.)

దేవరకొండ పరిధిలోని నేషనల్

హైవే 167 పక్కన గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ శనివారం స్థానిక మహిళలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

గత కొన్ని రోజులుగా కాలనీలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నప్పటికీ, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక చాలా రోజులు అవుతోందని, రోజువారీ అవసరాలకు కూడా నీరు లేక నరకం చూస్తున్నామని మండిపడ్డారు. ధర్నా కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు రెండు గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. కేవలం తాగునీరే కాకుండా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన సివిల్ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ కాలనీ నిర్వహణను వెంటనే దేవరకొండ మున్సిపాలిటీకి అప్పగించాలని, అప్పుడే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు స్పష్టం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి, సీఐ వెంకట్రెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి రోడ్డుపై నుంచి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande