
భోగపురం, 01 ఆగస్టు (హి.స.)
భోగపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో వేదికపై తనదైన శైలిలో గర్జించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వ తీరుపై మరియు ప్రధాని నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎర్రబస్సు రాని చోట ఎయిర్బస్సా?' అని గతంలో కూటమి విజన్ను అవహేళన చేస్తూ విమర్శించిన వారికి, ఈరోజు కళ్లు చెదిరేలా నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే సరైన సమాధానం అని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశాన్ని నడిపించడం అంటే ఒక 'రామకార్యం' లాంటిదని, హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురైనట్లే, దేశాభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకుడికి కూడా అనేక అడ్డంకులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని తాను బలంగా కోరుకున్నది కేవలం స్థిరమైన మరియు బలమైన కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి రక్షణగా నిలుస్తుందనేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఆర్థికాభివృద్ధికి సరికొత్త మైలురాయి : గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధికి ఒక పవర్హౌస్గా మారుతుందని ప్రశంసించారు. కేవలం విమాన ప్రయాణ సదుపాయమే కాకుండా, ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం విస్తరిస్తుందని, ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతాల యువతకు స్థానికంగానే వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే సమన్వయంతో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
యువత కలలకు సరికొత్త రెక్కలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన ప్రాజెక్టుపై స్పందించారు. భోగాపురం విమానాశ్రయం కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర యువత ఆకాంక్షలకు, వారి భవిష్యత్తు కలలకు లభించిన నిజమైన రెక్కలని అభివర్ణించారు. విశాఖపట్నం ఐటీ కారిడార్ మరియు ఫార్మా రంగానికి ఈ గ్లోబల్ కనెక్టివిటీ తోడవడంతో, ప్రపంచవ్యాప్త దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూసేందుకు ఈ ఎయిర్పోర్ట్ ఒక ప్రధాన ద్వారంగా మారుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi