
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ఫీజులను పెంచాలంటూ యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తులను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి వైద్య విద్య ఫీజులలో ఎలాంటి పెంపుదల ఉండబోదని, పాత ఫీజుల విధానమే కొనసాగుతుందని వైద్య విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈరోజు స్పష్టం చేశారు. కాలేజీల నిర్వహణ వ్యయం పెరిగిందనే సాకుతో ఫీజులు పెంచాలని ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ఒత్తిడి తెచ్చినప్పటికీ, మధ్యతరగతి విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందని అధికారులు వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi