
నెల్లూరు , 18 ఆగస్టు (హి.స.) నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావనికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని, సీపీయం నాయకులతో కలసి వినతిపత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
బైపాస్ రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో రహదారిపై మట్టి, ఇసుక పేరుకుపోయి వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో పెద్దఎత్తున దుమ్ము, ధూళి ఎగసిపడుతోందన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, రహదారి వెంట నివసించే వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అసంపూర్తి రహదారి కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రమాదాల ముప్పు పెరుగుతోందని డేవిడ్రాజు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు రహదారిపై క్రమం తప్పకుండా నీటిని చల్లాలని, పేరుకుపోయిన మట్టి, ఇసుక, నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని కోరారు.
అదేవిధంగా రాత్రివేళ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని, పనులు ఎందుకు నిలిచిపోయాయో ప్రజలకు వివరించి, పూర్తి చేసే గడువును వెల్లడించాలని ఆర్డీఓను కోరారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి బైపాస్ రోడ్డు పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV