హైదరాబాద్లో ఆషాఢ బోనాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం: సీపీ సజ్జనార్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి సీపీ సజ్జనార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Bonalu


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని (Ujjaini Mahankali Temple Bonalu) హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) దంపతులు ఈరోజు (ఆదివారం) దర్శించుకున్నారు. అమ్మవారికి సజ్జనార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాలకు ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని వివరించారు.

భక్తుల భద్రత, రక్షణే ధ్యేయం..

ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా అమ్మవార్ల బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈ వేడుకల కోసం దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరంతర నిఘా కోసం ఆలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఏఐ సాంకేతికత కలిగిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తి అయ్యేలా పోలీసు శాఖకు భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande