
గువాహటి, 02 ఆగస్టు (హి.స.)అస్సాంలోని గువాహటి ఐఐటీలో చదువుతున్న కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో తహసీల్దార్ కుమార్తె మృతి. కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఏకైక కుమార్తె, అస్సాంలోని గువాహటి లో ఐఐటి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చేతన (20) బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటన అందరినీ కలచివేసింది. స్నేహితులతో కలిసి అస్సాంలోని భ్రహ్మపుత్ర నది వద్దకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన అనంతరం అధికారులు మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే అస్సాంకు బయలుదేరి వెళ్లారు. మృతురాలు చేతన స్వగ్రామం కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామం కాగా ఉన్నత విద్య కోసం వెళ్లిన కుమార్తె అకాల మరణం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తగా,ఈ విషాద వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV