
అమరావతి, 28 ఆగస్టు (హి.స.)
డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తామని మంత్రి నారాయణవ్యాఖ్యానించారు. లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై మంత్రి నారాయణ ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.
జగన్ రెడ్డి హయాంలో వదిలి వెళ్లిన 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. భూమిపైన ఉన్న వేస్ట్ను ఇప్పటికే పూర్తిగా తొలగించామని తెలిపారు. భూమి లోపల ఉన్న చెత్తను కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఏ రోజు చెత్తను అదే రోజు పూర్తిగా విద్యుత్గా మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఈలోగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని అన్నారు. ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మొత్తం చెత్తను ప్లాంట్లకు తరలించాలని మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ