
జోగులాంబ గద్వాల, 28 ఆగస్టు (హి.స.)
ఎలాంటి సమాచారం లేకుండా వైద్య
సిబ్బంది సెలవులపై వెళ్లడంతో జోగులాంబ గద్వాల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం ఆలంపూర్ చౌరస్తాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పని చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రోగులు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ సరైన వైద్య సేవలు అందించకుండా కర్నూల్ కు, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులను హెచ్చరించారు. ఆసుపత్రిలోని పలువురు రోగులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వారికి అందజేస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఇన్ పేషెంట్లను ప్రతి రోజు వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి తరచూ పరీక్షిస్తూ ఉండాలని, ఆహారాన్ని మెనూ ప్రకారం అందజేయాలన్నారు. ల్యాబ్ ను తనిఖీ చేసి ప్రతిరోజు వివిధ రకాల పరీక్షలను పక్కాగా చేస్తూ రోగులకు రిపోర్టును సకాలంలో అందజేయాలని ఆదేశించారు. గైనిక్, యూఎస్ జీ, ఫార్మసీ, ఈసీజీ, తదితర విభాగాలను సందర్శించి అక్కడి సిబ్బంది పనితీరును గమనించారు. హాజరు రిజిస్టర్ తో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. కొంతమంది సిబ్బంది ఎక్కువగా సెలవులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరైన పనితీరు కనబరచకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నందున ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని, పరిసరాల్లోని పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణకు ఏజెన్సీని నియమించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు