
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.) ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గదినుంచి ప్రేమలేఖలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, అశోక్నగర్లోని ఉదయ్ రూమ్లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండు ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన వివాహితతో అతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు గుర్తించారు. ఆ మహిళకు 2014లో వివాహమైంది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.
ఈ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో ఆ మహిళకు స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఏర్పడ్డాక లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని అతడు కోరాడు. చట్టప్రకారం భర్తతో విడాకులు రాకపోవటంతో ఆమె లివ్ ఇన్లో ఉండటానికి తిరస్కరించినట్లు సమాచారం. ఆ మహిళను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మరో బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిశారు. ఉదయ్ ప్రవర్తన గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. ఉదయ్ తనపై దాడి చేయటమే కాకుండా విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్.. ఆ మహిళతో చెప్పారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్ చెప్పిన విషయాల కారణంగా ఆ మహిళ ఉదయ్ను దూరం పెట్టింది. ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి ప్రవేశించి ఫోన్ లాక్కున్నాడనే ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. 20 మంది వాంగ్మూలాలు నమోదు చేశారు. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని మరింత దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్