
అమరావతి, 04 ఆగస్టు (హి.స.)
మెగా డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వేసిన పిల్పై జోక్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టునిరాకరించింది. స్పోర్ట్స్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది. బాధిత అభ్యర్థులు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు భయపడుతున్నారనే వాదనతో ఏకీభవించలేమని తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటివరకు 335 పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు పేర్కొంది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యమనేది చాలా విలువైన సాధనమని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం దానిని వినియోగించడానికి అనుమతిస్తే పిల్ ఉద్దేశం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈ పిల్పై వాదనలు కొనసాగిస్తారా?, ఉపసంహరించుకుంటారా? పిటిషనర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తమ ముందుకు రావాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదికి న్యాయస్థానం వెల్లడించింది. మెగా డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ హైకోర్టులో చంద్రశేఖర్రెడ్డి హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ