పార్లమెంట్ మోదీ ప్రభుత్వానికి ఆటస్థలంగా మారింది: మల్లు రవి
అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు.
Mallu ravi


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Congress MP Mallu Ravi) డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగ మయ్యాయని తెలిపారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీ వేదికగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అని చెప్పుకొచ్చారు. ఒక్కరోజు కూడా పార్లమెంట్ పని చేయకుండా వాయిదాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ మోదీ ప్రభుత్వానికి ఒక ఆటస్థలంగా మారిందని ధ్వజమెత్తారు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా..

సభలో ఏ మాత్రం చర్చలేకుండా బిల్లులు ఆమోదించుకుంటున్నారని మల్లు రవి ఆగ్రహించారు. పార్లమెంట్ నడవకపోగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన నియోజకవర్గంలో కమలం పార్టీ అభ్యర్ధి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోవడంతోనే బీజేపీకి వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక చోట గెలిచింది

మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఒక చోట మాత్రమే గెలిచిందని మల్లు రవి అన్నారు. బీజేపీ త్వరలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారని మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వివరణ ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande