
అమరావతి, 05 ఆగస్టు (హి.స.)
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న వినూత్న చర్యలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా అభినందించారు. లోక్ భవన్ దర్బార్ హాలులో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఈగల్ వార్షిక నివేదిక - 2025 పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ నివేదికను గవర్నర్కు అందజేస్తూ... గత ఏడాదిన్నర కాలంలో ఈగల్ విభాగం చేపట్టిన మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, సాధించిన విజయాలను సుదీర్ఘంగా వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టి, రైతులకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా జరిగే గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేని నిషిద్ధ మందుల అక్రమ విక్రయాలను అరికట్టడం వంటి అనేకాంశాలను గవర్నర్కు వివరించారు. గవర్నర్.. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణని, ఆయన బృందాన్ని అభినందించారు. రెడ్ క్రాస్, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ’ఈగల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్’ నిర్వహిస్తామని ఈగల్ ఐజీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ జి.స్వరూపారాణి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ