
కర్నూలు,, 05 ఆగస్టు (హి.స.)
జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించిన విషయాన్ని గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, చిరుత కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ