
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలు సమృద్ధిగా పండి.. నదులు జలాశయాలు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చెందని వేద పండితులు, అర్చకులు ఆగస్టు 10వ తేదీన ఈ యాగం నిర్వహించనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్లోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.108 మంది ఋత్వికులు,11 హోమకుండాలు, వేదపండితులు, అర్చకులు ఈ యాగ క్రతువును నిర్వహిస్తారు. ఎల్ నినో ప్రభావం లేకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహా యాగం నిర్వహిస్తారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ మహా వరుణ యాగం నిర్వహించనున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదులతోపాటు రైతాంగ శ్రేయస్సు, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం ఈ వరుణ యాగం చేపడుతున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్