ఉత్తర ప్రదేశ్ జూలై 10 (హిం.స)
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని బంగార్మావ్ సీహెచ్సీ ఆస్పత్రికి తరలించారు.
ఉన్నావ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 5.15 గంటలకు లఖ్నవూ- ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బిహార్ నుంచి దిల్లీకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని ఉన్నావ్ డీఎం గౌరంగ్ రాఠీ తెలిపారు.
సీఎం యోగి స్పందన
అయితే ఘోర రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు