తిరుమల, 22 అక్టోబర్ (హి.స.)
: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. వర్షం ప్రభావం నేపథ్యంలో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనాల డ్రైవర్లను తితిదే అప్రమత్తం చేస్తోంది. వర్షం ప్రభావం నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు.
తిరుగిరులు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమరహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం.. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు.(
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ