
పట్నా/ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.)
: బిహార్ ఎన్నికల్లో) ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల (Panchayat Heads) వేతనాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్, రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. చేతివృత్తులపై ఆధారపడిన వారికి.. తమ పనిని మరింత విస్తరించుకోవడానికి వీలుగా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే మహిళల కోసం జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ.30 వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని తమ పార్టీ ప్రకటించిందన్నారు.
నీతీశ్ నేతృత్వంలోని ప్రభుత్వంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆయనకు 20 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని.. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలలలోనే బిహార్ను అభివృద్ధిలో నంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘మహాగఠ్బంధన్’లో చీలికలు ఉన్నాయని ఎన్డీఏ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహనీ తానూ కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నామని.. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ