
విశాఖపట్నం:27 అక్టోబర్ (హి.స.) మొంథా తుపాను ప్రభావంతో విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. కైలాసపురంలో గాలుల ప్రభావానికి చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్డుపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని జీవీఎంసీ అధికారులు ప్రజలను సూచించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి తుపాను పరిస్థితిని ప్రత్యేకాధికారి అజయ్జైన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు.
మరోవైపు అనకాపల్లి జిల్లాలోని పలు జలాశయాల వద్ద అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాల వద్ద ఏఈలతో కూడిన బృందం 24 గంటలూ విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తాండవ జలాశయంలో నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ