
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)
వలసలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న సమయంలో కూడా అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేవారి సంఖ్య ఆగడం లేదు. అలా డంకీ మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అగ్రదేశం వెనక్కిపంపింది (US deported Indians). దాంతో వారంతా దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారని, వారిని వారి కుటుంబీకులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు.
ఈ 54 మంది భారతీయుల్లో అత్యధికులు హరియాణాకు చెందినవారే ఉన్నారు. కర్నాల్, ఖైతాల్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్, సోనీపత్ నుంచి డంకీ రూట్లో అమెరికా (USA) వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి వారిని పంపించిన ఏజెంట్లపై మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లవద్దని, దానివల్ల కొత్త సమస్యలు కొనితెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ