శ్రీనగర్, 6 అక్టోబర్ (హి.స.) పహల్గాం దాడిలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జులై 29న ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం ఘటనా స్థలంలో పలు వస్తువులతో పాటు పాక్షికంగా ధ్వంసమైన ఓ ఛార్జర్ను స్వాధీనం చేసుకుంది. ఆ ఛార్జర్ మహమ్మద్ యూసుఫ్ కటారీ(26) అనే వ్యక్తిదిగా గుర్తించిన పోలీసులు గతనెల 29న అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హమ్జా అఫ్రానీలను జబర్వాన్ హిల్స్లో కటారీ నాలుగు సార్లు కలిసి మాట్లాడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎత్తైన ప్రాంతాల్లో సంచార బాలలకు విద్యను బోధించే కటారీ ఉగ్రవాదులకు కీలక సమాచార వనరుగా ఉన్నాడు. వారికి ఓ ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్ను సరఫరా చేశాడు. ఉగ్రవాదులకు కీలక వస్తువులను అందించడంతో పాటు క్లిష్ట ప్రదేశాల్లో వారికి దిశానిర్దేశం చేసేవాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ